తెలంగాణలో జనసేన జోరు... భారీ చేరికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
- తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్
- తెలంగాణ జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు
- క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన ఫోకస్ పెంచింది. తెలంగాణలో పార్టీ ఉనికిని చాటడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేసేందుకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాచరణ మొదలుపెట్టారు.
రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఇతర పార్టీల నుండి వచ్చే వలసలను సమన్వయం చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన 'తెలంగాణ జాయినింగ్స్ కమిటీ'ని అధికారికంగా నియమించారు. పార్టీ భావజాలానికి ఆకర్షితులవుతున్న విద్యావంతులు, సామాజికవేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు, తటస్థులను లైన్లోకి తెచ్చే బాధ్యతను ఈ ఏడుగురు సభ్యులకు అప్పగించారు.
తెలంగాణ జాయినింగ్స్ కమిటీ సభ్యులు:
ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
డా. గడల శ్రీనివాస్ (తెలంగాణ రాష్ట్ర మాజీ మెడికల్ డైరెక్టర్)
గొట్టిముక్కల నరేష్ రెడ్డి
అబ్దుల్ హనీఫ్
అల్లాడి తనీష్ (సినీ నటుడు)
చిరాగ్ ప్రజీత్ గౌడ్
మేడూరి సరస్వతి (తెలంగాణ రాష్ట్ర మాజీ డీసీపీ)
తెలంగాణ వ్యాప్తంగా వస్తున్న చేరికల విజ్ఞప్తులను ఈ జాయినింగ్స్ కమిటీ మొదట క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆ రిపోర్టులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి క్లియరెన్స్ చేసి, నేరుగా అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం పవన్ ఇచ్చే దిశా నిర్దేశం మేరకు త్వరలోనే హైదరాబాద్ వేదికగా భారీ ఎత్తున చేరికల కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించనున్నారు.