పుష్ప-2 తొక్కిసలాట కేసులో నేడు క్లైమాక్స్.. నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న అల్లు అర్జున్!

Allu Arjun to appear personally before Nampalli court today in Pushpa 2 stampede case
  • పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట
  • రేవతి అనే మహిళ మృతి.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు
  • ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
  •  ఆన్‌లైన్, వర్చువల్‌గా హాజరు కావడానికి కోర్టు నిరాకరణ
  • నేడు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో న్యాయపరమైన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ.. ఈరోజు (జూన్ 22) అల్లు అర్జున్ వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌ వద్ద అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక రేవతి (39) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా.. థియేటర్ యాజమాన్యం, అక్కడి సిబ్బందిని ఏ1 నుంచి ఏ10 నిందితులుగా పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్‌ను ఈ కేసులో 11వ నిందితుడిగా చేర్చడం సంచలనంగా మారింది. ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సమన్వయ లోపంతో వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చార్జ్‌షీట్‌లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతించాలన్న అల్లు అర్జున్ లీగల్ టీమ్ అభ్యర్థనను నాంపల్లి కోర్టు పక్కనబెట్టేసింది.

గతంలో ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ కుటుంబం బాధిత కుటుంబానికి వైద్య ఖర్చులు, భారీ పరిహారం అందించి ఆదుకున్నట్లు సమాచారం. అయితే క్రిమినల్ విచారణ ప్రక్రియలో భాగంగా నేడు ఆయన కోర్టుకు స్వయంగా హాజరవుతారా? లేక ఈ చార్జ్‌షీట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా? అనేది టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ బన్నీ, మిగతా నిందితులు ఈరోజు న్యాయస్థానం ముందు హాజరైతే ఈ హైప్రొఫైల్ కేసు విచారణ తదుపరి దశకు చేరుకుంటుంది.  
Go Back to Shorts
Allu Arjun
Pushpa 2 stampede case
Nampalli court summons
Sandhya Theater incident
Tollywood actor court appearance
Pushpa 2 The Rule

More Telugu News