అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
- ప్రెస్ మీట్ మధ్యలో తల్లి ఫోన్ లిఫ్ట్ చేసిన క్రికెటర్ నితీశ్ రెడ్డి
- మరలా కాల్ చేస్తాను అమ్మా అంటూ మీడియా సమావేశం కొనసాగింపు
- ఆటైనా, ప్రెస్ మీటైనా అమ్మే ఫస్ట్ అంటూ నితీశ్పై లోకేశ్ ప్రశంస
- ఏపీ క్రికెటర్ సంస్కారానికి ముగ్ధుడైనట్లు తెలిపిన మంత్రి
- తొలి వన్డేలో 2 వికెట్లు పడగొట్టిన నితీశ్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
వివరాల్లోకి వెళితే, ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించి, సెంచరీ హీరో రహ్మనుల్లా గుర్బాజ్తో సహా 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా ఫోన్ మోగింది. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గమనించిన నితీశ్, మీడియాకు క్షమాపణ చెప్పి, "అమ్మా, నేను మళ్లీ కాల్ చేస్తాను" అని సున్నితంగా చెప్పి ఫోన్ పెట్టేశారు. అనంతరం ప్రెస్ మీట్ను కొనసాగించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా.. అమ్మే ఫస్ట్. వెల్ ప్లేయడ్, నితీశ్!" అని పేర్కొంటూ ఆ వీడియోను ఆయన పంచుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, తల్లి పట్ల నితీశ్ చూపిన గౌరవం, సంస్కారం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటతోనే కాకుండా, తన ప్రవర్తనతో కూడా నితీశ్ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.