ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు
- ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
- అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
- అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్లో రైతులకు అందాల్సిన ఎరువులను పక్కదారి పట్టిస్తూ, ఇతర వ్యవసాయేతర పనులకు తరలించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలించే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అక్రమ నిల్వలపై నిఘా పెట్టేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫెర్టిలైజర్ డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్కు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఎరువుల పంపిణీలో వ్యవసాయ శాఖ అధికారుల వైపు నుంచి ఏమైనా నిర్లక్ష్యం ఉందా అనే కోణంలోనూ తక్షణమే విచారణ జరపాలని ఆయన సూచించారు.
రైతులకు సాగు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఇకపై ప్రతిరోజూ జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై (స్టాక్) ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అన్నదాతలను మోసం చేసే ఏ ఒక్క చర్యను ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. ఏ డీలరైనా ఎరువులను బ్లాక్కు తరలించినా లేదా పక్కదారి పట్టించినా వారి లైసెన్సులను తక్షణమే రద్దు చేయడంతో పాటు, వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆజ్ఞాపించారు.