క్వాంటంతో డీప్ టెక్ రంగంలో సీఎం చంద్రబాబు ముందడుగు: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రశంస

Chandrababu Naidu Leads in Deep Tech Quantum Field
  • అమరావతిలో ప్రారంభమైన దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలు
  • ఐటీ తర్వాత డీప్ టెక్ రంగంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని ప్రశంసలు
  • భవిష్యత్తులో ఏఐ, క్వాంటం రంగాలకు అమరావతి హబ్‌గా మారుతుందన్న నిపుణులు
  • దేశీయంగా క్వాంటం హార్డ్‌వేర్ తయారీ, ధ్రువీకరణలో ఈ కేంద్రాలు కీలకం
  • నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఏర్పాటు
క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీలో చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన క్వాంటం రిఫరెన్స్ టెస్టింగ్ ఫెసిలిటీల ప్రారంభోత్సవంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాందికర్ పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సౌకర్యాలు అందుబాటులోకి రావడం, క్వాంటం విప్లవంలో దేశం ఇస్తున్న ఒక బలమైన సందేశమని ఆయన అభివర్ణించారు. ఈ ఫెసిలిటీల ప్రారంభం, దేశాన్ని సాంకేతికంగా సార్వభౌమ దేశంగా, వికసిత్ భారత్‌గా మార్చే లక్ష్యంలో కీలకమైన ముందడుగు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అభయ్ కరాందికర్ మాట్లాడుతూ, ఐటీ రంగాన్ని సమర్థంగా అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు భవిష్యత్ టెక్నాలజీ అయిన డీప్ టెక్ రంగంలోనూ ముందుచూపుతో ముందడుగు వేశారని ప్రశంసించారు. భవిష్యత్ టెక్నాలజీలను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు, ప్రగతిని వేగంగా సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ క్వాంటం టెస్ట్ బెడ్‌లను నిర్మించడం ద్వారా డీప్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు పునాది పడిందని వివరించారు. 

క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్ తయారీ, సర్టిఫికేషన్‌లో ఈ రిఫరెన్స్ ఫెసిలిటీలు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తాయని, నేషనల్ క్వాంటం మిషన్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తాయని ఆయన తెలిపారు. కేవలం ఉపకరణాలు మాత్రమే కాకుండా, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా కమ్యూనికేషన్, ఫైనాన్స్, డిజైన్లు, ప్రెసిషన్ సెన్సింగ్ వంటి కీలక రంగాల్లో నూతన ఆవిష్కరణలు రావాల్సి ఉందని ఆకాంక్షించారు. 

ఈ రంగంలో మానవ నైపుణ్యాలను పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, క్వాంటం నిపుణులను తయారు చేయడంలో ఏపీ ముందంజలో ఉండటం అభినందనీయమని అన్నారు. ప్రైవేటు రంగంలో జరిగే పరిశోధనల కోసం నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా ప్రత్యేక నిధి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

చంద్రబాబు వేగాన్ని దేశమంతా అందుకోవాలి: అజయ్ కుమార్ సూద్

ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించిన కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు అజయ్ కుమార్ సూద్, ముఖ్యమంత్రి చంద్రబాబును "విజనరీ సీఎం"గా అభివర్ణించారు. క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీల ద్వారా చంద్రబాబు క్వాంటం రంగంలో విప్లవాన్ని అందిపుచ్చుకున్నారని కొనియాడారు. క్వాంటం టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలకమైన ముందడుగని, భవిష్యత్తులో అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం రంగాల్లో దేశానికి హబ్‌గా మారుతుందని జోస్యం చెప్పారు. 

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు చూపిస్తున్న వేగం దేశవ్యాప్తంగా ప్రతిఫలించాలని ఆకాంక్షించారు. ఐటీ రంగంలో ప్రపంచానికి మన సత్తా చాటినట్లే, క్వాంటం రంగంలోనూ నిపుణులను సత్వరం సిద్ధం చేసుకోవాలని సూచించారు. అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు వేసిందని, ఈ ప్రయాణాన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్‌తో పాటు ఇతర ఆవిష్కరణలకు కూడా విస్తరించాలని కోరారు.


Go Back to Shorts
Chandrababu Naidu
Quantum Technology
Andhra Pradesh
Amaravati
Abhay Karandikar
Ajay Kumar Sood
Deep Tech
Quantum Computing
National Quantum Mission
Quantum Valley

More Telugu News