"జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల

Nimmala Accuses Jagan of Political Terrorism in Andhra Pradesh
వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయని, ఆయన 'గొడ్డలి రాజకీయం' రాష్ట్రానికి పెను ప్రమాదంగా పరిణమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నరుకుతాం, చంపేస్తాం" అనే నీచమైన భాషతో రాజకీయాలు చేస్తూ, విధ్వంసాన్నే తమ అజెండాగా వైసీపీ మార్చుకుందని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ రెడ్డి తన హిడెన్ అజెండాను ఇప్పుడు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అన్నారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా వారి తీరు ఉందని మండిపడ్డారు.

ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం
రాజకీయ పార్టీలు ప్రజలకు మేలు చేస్తామని చెప్పాలి కానీ, వైసీపీ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతామని, పనులు ఆపేస్తామని, యువతను చెడగొడతామని చెబుతోందని నిమ్మల ఎద్దేవా చేశారు. వైసీపీ 'యూత్ పాలసీ' అంటే మద్యం వ్యాపారాలు చేయడం, కొత్త మాదక ద్రవ్యాలు తెచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయడమేనా? అని ప్రశ్నించారు.

"గుంటూరు ఇవతల లాగి కొడతాం, అవతల నరుకుతాం" అని బాహాటంగా హెచ్చరిస్తూ, తల్లులకు పుత్రశోకం మిగిల్చడానికే వైసీపీ నేతలు అధికార దాహంతో ఉన్నారని ఆరోపించారు. జంతువులను నరికి ఆ రక్తాన్ని ఫ్లెక్సీలపై చల్లుతూ రాక్షసానందం పొందేవారు ప్రజలకు ఏం మేలు చేస్తారని నిలదీశారు. 

వాస్తవాలు రాస్తున్న మీడియా సంస్థల నాలుకలు కోస్తామని బెదిరించడం రాజ్యాంగం కల్పించిన ఫోర్త్ ఎస్టేట్ గొంతు నొక్కడమేనని అన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా జగన్‌కు బుద్ధి రాలేదని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మరింత ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వివేకా హత్యపై ప్రశ్నల వర్షం
వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ మంత్రి నిమ్మల, జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. "రాజకీయాల కోసం సొంత బాబాయ్‌నే గొడ్డలితో వేటు వేసిన చరిత్ర జగన్‌ది. వివాదరహితుడైన వివేకాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బెదిరించినప్పుడు, నాడు సోనియా గాంధీ మిమ్మల్ని మందలించింది నిజం కాదా?" అని ప్రశ్నించారు. 

వివేకా గొడ్డలిపోటుతో చనిపోతే, దాన్ని 'గుండెపోటు'గా సాక్షి మీడియాలో ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు. సొంత చిన్నాన్న హత్యకు గురైతే 12 గంటలు ఆలస్యంగా వచ్చి సాక్ష్యాలు చెరిపేయడంలో ఎందుకు నిమగ్నమయ్యారని అడిగారు. ప్రపంచంలో ఎక్కడైనా హత్యకు గురైన వ్యక్తికి కుట్లు వేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారా? అని మండిపడ్డారు. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు మాయమైనట్లే, నేడు వివేకా హత్య కేసులోనూ సాక్షులను మాయం చేస్తున్నారని, దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కుటుంబ సభ్యుల పట్ల వైఖరి ఇదేనా?
జగన్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని నిమ్మల అన్నారు. "నా తల్లి, నా చెల్లి" అంటూనే వారిని ఇంటి నుంచి బయటకు గెంటారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని మహిళలకు మేలు చేస్తానని చెప్పడం నయవంచన కాదా? అని ప్రశ్నించారు. 

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, ఆయన ఆచూకీ కూడా తెలియని సమయంలో సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కావాలని చూడటం జగన్ వికృత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. "జగన్ రాకను తండ్రి రాజశేఖర్ రెడ్డి గారే ఇష్టపడలేదు. మీరు చెప్పి అతన్ని బెంగళూరులోనే ఉండమనండి" అని స్వయంగా విజయమ్మ గారే నాడు రోశయ్య గారికి ఫోన్ చేసి వేడుకున్నారని, దీన్నిబట్టి జగన్ నైజం అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

రంగా గారి పేరు ఎత్తే అర్హత లేదు
వంగవీటి రంగా గారి గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని నిమ్మల రామానాయుడు ఘాటుగా విమర్శించారు. "రంగా గారి హంతకులను అక్కున చేర్చుకున్న చరిత్ర జగన్‌ది. రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడి కుమారుడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడో జగన్ చెప్పాలి. హంతక కుటుంబానికి హైదరాబాద్‌లో కోట్ల విలువైన భూమిని ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చారు?" అని ప్రశ్నించారు. 

రంగా గారిని 'రౌడీ' అని అవమానించిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ పదవి ఇచ్చి సత్కరించడం, రంగా గారిపై జగన్‌కు ఉన్న విద్వేషానికి నిదర్శనమని అన్నారు. హంతక కుటుంబాలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ రంగా పేరు ఎత్తడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.

గొడ్డలి పార్టీకి రాజకీయ సమాధి
నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక ఉగ్రవాదిగా మారిన జగన్, నేడు రాజకీయ ఉగ్రవాదిగా మారి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని నిమ్మల ఆరోపించారు. 2019-24 మధ్య వైసీపీ పాలనతో జరిగిన నష్టం, రాష్ట్ర విభజన నష్టం కన్నా ఎక్కువని అన్నారు. ఆ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తున్నారని తెలిపారు. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంటే, మళ్లీ విధ్వంసం సృష్టించాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ జెండాను పక్కనపెట్టి 'గొడ్డలి'ని జెండాగా చేసుకున్న ఈ 'గొడ్డలి పార్టీ'కి ప్రజలు రాజకీయ సమాధి కట్టాలని, ఇలాంటి ఉన్మాద పార్టీని రాష్ట్రం నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Nimmala Ramanayudu
Jagan Mohan Reddy
YS Vijayamma
TDP
YCP
Viveka Murder Case
Andhra Pradesh Politics
Goddali Politics
Vangaveeti Ranga
Chandrababu Naidu

More Telugu News