తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటి భారత్ చేరుకున్న 'గ్రీన్ ఆశా'
- 15,400 టన్నుల ఎల్పీజీతో ముంబై పోర్టుకు చేరిన 'గ్రీన్ ఆశా' నౌక
- పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత జేఎన్పీఏకు చేరిన తొలి నౌక ఇదే
- హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా భారత్కు వచ్చిన ట్యాంకర్
- దేశ ఇంధన భద్రతకు ఇది కీలక మైలురాయి అని అధికారుల వెల్లడి
భౌగోళికంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన ఈ నౌక, జేఎన్పీఏలోని భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) నిర్వహిస్తున్న లిక్విడ్ బెర్త్లో లంగరు వేసింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రారంభమైన తర్వాత జేఎన్పీఏకు చేరుకున్న మొట్టమొదటి ఎల్పీజీ నౌక ఇదే కావడంతో దీనిని ఒక ముఖ్యమైన మైలురాయిగా అధికారులు అభివర్ణించారు. నౌకలోని సిబ్బంది, కార్గో అంతా సురక్షితంగా ఉన్నట్లు జేఎన్పీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని దాటిన ఎనిమిదో భారత నౌక 'గ్రీన్ ఆశా'. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ దేశానికి అవసరమైన నిత్యావసర సరుకుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించే భారత సముద్ర రవాణా సామర్థ్యానికి ఈ సంఘటన నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నౌక రాకతో దేశీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థకు మరింత భరోసా లభించినట్లయింది.