Jagan Mohan Reddy: కేఏ పాల్ స్థానాన్ని జగన్ భర్తీ చేశారు: కోటంరెడ్డి సెటైర్
వైసీపీ అధినేత జగన్ పై నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
అమరావతి చట్టబద్ధత అంశంపై జగన్ స్పందిస్తున్న తీరును కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నామన్న నిరాశతోనే జగన్ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. "జగన్ ప్రస్తుతం 'మావిగన్.. మావిగన్' అంటూ వింతగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కేఏ పాల్కు, మీకు తేడా ఉండదు. రాజకీయాల్లో ఇప్పుడు కేఏ పాల్ స్థానాన్ని జగన్ భర్తీ చేశారు" అని ఎద్దేవా చేశారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతోనే అమరావతి బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని గుర్తుచేశారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ... మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని, మీరు విచక్షణతో మాట్లాడాలని సూచించారు. జగన్ వైఖరి వల్ల వైసీపీ మరింత పతనమవటం ఖాయమని అభిప్రాయపడ్డారు.