Potti Sriramulu: ఇకపై ఈ త్యాగమూర్తి విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నిలుస్తుంది: సీఎం చంద్రబాబు

Potti Sriramulu Statue of Sacrifice Unveiled by CM Chandrababu
షార్ట్స్‌లో చూడండి
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయిలో నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, ఆయన 58 రోజుల నిరాహారదీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగనిరతికి ప్రతీక) అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నారాయణ, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. స్పూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. "అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి గుర్తుగా 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఉంది. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజలందరి వాడు. ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పోస్టల్ కవర్‌ను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

గత పాలనపై, రాజధాని విధ్వంసంపై ఆవేదన

గత ఐదేళ్ల పాలనలో రాజధాని అమరావతిని విధ్వంసం చేసిన తీరుపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "తెలుగు జాతికి గుర్తింపు లేని రోజుల్లో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధిస్తే, గత పాలకులు రాజధానితో మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మొదట్లో ఎవరూ గుర్తించని విధంగానే, రాజధాని కోసం 34,000 ఎకరాల భూములిచ్చిన ఇక్కడి రైతుల త్యాగాన్ని కూడా గత ప్రభుత్వం అవమానించింది. 2019-24 మధ్య రాజధాని రైతులు చేసిన పోరాటం ఒక చరిత్ర," అని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం మా లక్ష్యం

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏర్పడిందని, అభివృద్ధి-సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. "మూడేళ్లలో అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తామో మీరే చూస్తారు. 'నా రాజధాని అమరావతి' అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. ఇప్పుడు దాని నిర్మాణాన్ని వేగవంతం చేశాం. వచ్చే పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం," అని హామీ ఇచ్చారు.

ఆర్యవైశ్యులకు భరోసా.. కీలక నిర్ణయాలు

ఈ సందర్భంగా ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. "గత ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకోలేని భయానక పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. దానధర్మాలకు ముందుండే ఆర్యవైశ్యులు అదే సంకల్పంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారి మనోభావాలను గౌరవిస్తూ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. వాసవీ మాత పుట్టిన పెనుగొండను 'వాసవీ పెనుగొండ'గా మారుస్తున్నాం. వేర్వేరు పేర్లతో ఉన్న ఉపకులాలన్నింటినీ 'ఆర్యవైశ్యులు'గా పరిగణిస్తూ త్వరలోనే జీవో తెస్తాం," అని ప్రకటించారు.

పవన్ చొరవతో 'అమరజీవి జలధార'

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ముందుకు తీసుకెళుతున్న, ఇంటింటికి నీళ్లిచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం 'జల్ జీవన్ మిషన్'కు రాష్ట్రంలో 'అమరజీవి జలధార' అని పేరు పెడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. నీరు తాగే ప్రతీసారి ప్రజలు పొట్టి శ్రీరాములును స్మరించుకోవాలనేదే దీని ఉద్దేశమని వివరించారు.

ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యంతో పనిచేస్తున్నారని, దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్-1 రాష్ట్రంగా నిలపడమే అమరజీవికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని, కష్టకాలంలో సమిష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Potti Sriramulu
Chandrababu Naidu
Statue of Sacrifice
Amaravati
Andhra Pradesh
Pawan Kalyan
Telugu Pride
Vasavi Penugonda
Jal Jeevan Mission
AP Politics

More Telugu News