YS Sharmila: నారీశక్తి వట్టిమాటే... మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

YS Sharmila Fires at Modi and Chandrababu Over Women Welfare
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను మోసం చేశాయన్న షర్మిల
  • సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు నయవంచనకు పాల్పడ్డారని ఆరోపణ
  • మహాశక్తి, తల్లికి వందనం పథకాలతో లక్షల మందికి అన్యాయం జరిగిందని విమర్శ
  • దేశంలో మహిళలకు భద్రత కరువైందంటూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్
  • గ్యాస్, విద్యుత్ ఛార్జీల భారంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ఆరోపించారు. ఆకర్షణీయమైన పథకాలతో మహిళలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో మహిళలకు ఇచ్చిన మూడు హామీలను విస్మరించి నయవంచనకు పాల్పడిందని షర్మిల విమర్శించారు. ‘మహాశక్తి’ పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని చెప్పి 1.80 లక్షల మందిని, ‘తల్లికి వందనం’ కింద 20 లక్షల మంది తల్లులను మోసం చేశారని ఆరోపించారు. వడ్డీ లేని రుణాల హామీతో 1.18 లక్షల డ్వాక్రా మహిళలను వంచించారని అన్నారు. ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచి వంటింటిపై భారం మోపారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వంపై కూడా షర్మిల విమర్శలు చేశారు. దేశంలో గంటకు 50 మంది మహిళలపై దాడులు జరుగుతుంటే ‘నారీశక్తి వందన్’ ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం మహిళలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను విస్మరించి, వారిని అర్ధరాత్రి అరెస్టు చేయించి అవమానించారని దుయ్యబట్టారు. రెండేళ్ల పాలనలో కుటుంబాలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం, మహిళలను ఉద్ధరించామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు గ్యాస్ ధరల భారాన్ని ప్రభుత్వమే మోసేదని ఆమె గుర్తుచేశారు.
YS Sharmila
Andhra Pradesh Congress
Chandrababu Naidu
Nari Shakti
women welfare schemes
AP Politics
Mahasakthi scheme
talliki vandanam
DWCRA loans
women safety

More Telugu News