Raghurama Chowdary: నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన పారిశ్రామికవేత్త రఘురామచౌదరి

Raghurama Chowdary Joins Janasena in Presence of Nagababu
  • జనసేనలో చేరిన పూతలపట్టుకు చెందిన సిద్ధార్థ్ ఆగ్రో ప్రాసెసింగ్ యజమాని
  • పవన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్న చౌదరి
  • అందరినీ సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తానని వెల్లడి

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సిద్ధార్థ్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ అధినేత గుర్రం రఘురామచౌదరి అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


ఈ కార్యక్రమంలో స్టేట్ ఐటీ కో-ఆర్డినేటర్ ఉయ్యాల శ్రీనివాస్, చిరంజీవి యువత అధ్యక్షుడు పూల ప్రభాకర్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామచౌదరి మాట్లాడుతూ... పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, పార్టీ విధివిధానాలకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంతో పాటు చిత్తూరు పార్లమెంటు స్థానం పరిధిలో జనసేనను బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ శ్రమిస్తానని తెలిపారు.

గత రెండు దశాబ్దాలుగా మామిడి గుజ్జు (Mango Pulp) పరిశ్రమ ద్వారా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులకు అండగా నిలుస్తున్న రఘురామచౌదరి, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై స్థానిక రైతులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


రఘురామచౌదరి వంటి బలమైన ఆర్థిక నేపథ్యం, సామాజిక వర్గ మద్దతు ఉన్న నేత చేరికతో చిత్తూరు జిల్లాలో జనసేన మరింత పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Raghurama Chowdary
Janasena Party
Nagababu
Chittoor District
Puthalapattu Constituency
Mango Pulp Industry
Pawan Kalyan
Andhra Pradesh Politics

More Telugu News