Hormuz Strait: హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన 37 భారత నౌకలు

37 Indian Flagged Vessels Stranded Near Hormuz Strait
  • హోర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
  • 1,109 మంది నావికులతో కూడిన 37 భారత జెండా కలిగిన నౌకలు నిలిచిపోయిన వైనం
  • పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, సమీప ప్రాంతాల్లో నిలిచిన నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం జెండాలు ఉన్న 37 నౌకలు హోర్ముజ్ జలసంధి తదితర ప్రాంతాల్లో నిలిచిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1,109 మంది నావికులతో కూడిన సుమారు 37 భారత జెండా కలిగిన నౌకలు పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, సమీప ప్రాంతాల్లో నిలిచిపోయాయి.

ఇందులో కొన్ని నౌకలు భారత ఔడరేవులకు ముడి చమురు, ఎల్ఎన్‌జీతో వస్తుండగా, మరికొన్ని గల్ప్ దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులు తీసుకురావడానికి వెళుతున్నవి ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆయా కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా విదేశీ జెండాలు కలిగిన నౌకల్లోని ముగ్గురు భారతీయ నావికుల మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మన నావికులు, మన నౌకల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేసింది.

షిప్పింగ్ కంపెనీస్ అండ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్సీస్ (ఆర్పీఎస్ఎల్ఎస్) నావికులకు కీలక సూచనలు జారీ చేసింది. యుద్ధం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, బంధువులతో క్రమం తప్పకుండా కమ్యూనికేట్ కావాలని సూచించింది. నావికుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా యాక్టివేట్ చేసింది.
Hormuz Strait
Iran
India
Indian sailors
Persian Gulf
Oman Gulf
Shipping
West Asia crisis
Crude oil

More Telugu News