50 నుంచి 100 శాతం భూముల విలువ పెంపు: కీలక వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy on Registration hike
  • జూన్ 5 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని ప్రకటించిన ప్రభుత్వం
  • ఈ పెంపుతో ఖజానాకు రూ.1,400 కోట్ల అదనపు ఆదాయం అంచనా
  • రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు లేదని, సబ్-రిజిస్ట్రార్ల అధికారాలకు కోత విధించినట్టు వెల్లడి
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూముల విలువలు 50 నుంచి 100 శాతం వరకు పెరగనున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు అదనంగా సుమారు రూ.1,400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూన్ 5వ తేదీ నుంచి సవరించిన కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ విలువలను సవరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముఖ్యంగా అధిక డిమాండ్ ఉండే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో పెంపు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు.

అదే సమయంలో, పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు సబ్-రిజిస్ట్రార్ల అధికారాలను గణనీయంగా తగ్గించినట్టు తెలిపారు. కొత్త రేట్లపై ప్రజల సందేహాలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితాలో పెట్టిందని అన్నారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి కూడా మంత్రి మాట్లాడారు. ఈ పథకం కోసం ఇప్పటివరకు రూ.7,000 కోట్లు విడుదల చేశామని, ఒకవేళ కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బిల్లులు చెల్లించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తుందని భరోసా ఇచ్చారు.
Go Back to Shorts
Ponguleti Srinivas Reddy on Registration hike

More Telugu News