Supreme Court: న్యాయవ్యవస్థపై ఎన్‌సీఈఆర్‌టీ ‘కుట్ర’.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Supreme Court Shock to NCERT over Controversial Textbook Content
  • వివాదాస్పద పాఠ్యపుస్తకంపై తక్షణ నిషేధం 
  • న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోందంటూ సీజేఐ ఆగ్రహం
  • బేషరతుగా క్షమాపణలు చెప్పిన కేంద్రం
  • అవినీతి పాఠ్యాంశంపై కఠిన చర్యలు.. మార్చి 11న తదుపరి విచారణకు ఆదేశం
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా పాఠ్యపుస్తకాల్లో అభ్యంతరకర అంశాలను ప్రచురించిన ఎన్‌సీఈఆర్‌టీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతిపై చేర్చిన అధ్యాయాన్ని తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ పుస్తకంపై తక్షణ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేవలం పొరపాటు కాదు న్యాయవ్యవస్థను కించపరిచేలా చేసిన ఉద్దేశపూర్వక కుట్ర అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బుల్లెట్ తగిలి రక్తం చిందిస్తోంది: సీజేఐ
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అత్యంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘‘ఎన్‌సీఈఆర్‌టీ ప్రయోగించిన బుల్లెట్‌ తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. కోర్టుల విశిష్ట చరిత్రను వివరించాల్సింది పోయి వ్యవస్థను అణచివేసేలా పాఠాలు రాయడం సరికాదు’’ అని మండిపడ్డారు. యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పట్ల అగౌరవం కలిగించేలా ఈ పాఠ్యాంశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులెవరో తేలేవరకు ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని, జవాబుదారీతనం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

కేంద్రం బేషరుతు క్షమాపణ
కోర్టు ఆగ్రహాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బేషరుతుగా క్షమాపణలు కోరారు. ఈ పాఠ్యాంశాన్ని ప్రభుత్వం ఏమాత్రం సమర్థించడం లేదని, పబ్లిక్ నోటీసు ద్వారా క్షమాపణలు చెబుతామని వెల్లడించారు. ఇప్పటికే వివాదాస్పద పుస్తకాల పంపిణీని నిలిపివేసి, వెబ్‌సైట్ నుంచి కూడా ఆ పాఠాలను తొలగించామని కోర్టుకు వివరించారు.

కఠిన చర్యలకు ఆదేశం
ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు ఈ వివాదాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు మార్చి 11న జరిగే విచారణలో వెల్లడికానున్నాయి.
Supreme Court
NCERT
Justice Surya Kant
textbooks
judicial system
corruption
Tushar Mehta
Kapil Sibal
Abhishek Singhvi
court order

More Telugu News