Advertisement

మహారాష్ట్రలో 5 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు.. పదేళ్ల నాటి జీవోకు మంగళం

Maharashtra Government Cancels 5 Percent Muslim Reservation
  • ముస్లిం రిజర్వేషన్లను అధికారికంగా రద్దు చేసిన ప్రభుత్వం
  • 2014 నాటి ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ కొత్త జీవో జారీ
  • ఇది కేవలం పరిపాలనాపరమైన చర్యేనని ప్రభుత్వ వర్గాల వెల్లడి
  • పదేళ్లుగా కోర్టు స్టే, ఆర్డినెన్స్ గడువు ముగియడంతో అమలులో లేని రిజర్వేషన్లు
  • ఇది మైనారిటీ వ్యతిరేక చర్య అంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శ
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముస్లింలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2014లో జారీ చేసిన ప్రభుత్వ తీర్మానాన్ని (జీవో) అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. పదేళ్లకు పైగా చట్టపరంగా అమలులో లేని ఈ రిజర్వేషన్లను, ఇప్పుడు అధికారిక రికార్డుల నుంచి తొలగించారు.

2014లో అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలను స్పెషల్ బ్యాక్‌వర్డ్ క్లాస్-ఏ (ఎస్‌బీసీ-ఏ) కేటగిరీ కింద చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే, దీనిపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా ఆ ఆర్డినెన్స్‌ను శాసనసభలో చట్టంగా మార్చకపోవడంతో అది వాటంతట అదే మురిగిపోయింది. సుప్రీంకోర్టు కూడా ఈ కోటాను పక్కన పెట్టింది.

న్యాయస్థానాల జోక్యం, ఆర్డినెన్స్ గడువు ముగియడంతో ఈ రిజర్వేషన్లు దశాబ్ద కాలంగా అమలులో లేవు. అయినప్పటికీ, పాత జీవో ప్రభుత్వ రికార్డుల్లో కొనసాగుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో పాత జీవోను, దానికి సంబంధించిన అన్ని సర్క్యులర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ కేటగిరీ కింద ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయరాదని స్పష్టం చేసింది. ఇది కేవలం పరిపాలనాపరమైన సవరణ మాత్రమేనని, రికార్డులను సరిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది మైనారిటీల అభివృద్ధిని అడ్డుకునే కుట్ర అని కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) నేతలు విమర్శించారు. "ఈ నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు అన్యాయం చేసింది" అని కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఆరోపించారు. ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని మరో కాంగ్రెస్ నేత నానా పటోలే విమర్శించారు.
Advertisement
Maharashtra Government
Muslim Reservation
Maharashtra
NCP
Congress
Bombay High Court
Supreme Court
Minority Rights
Naseem Khan
Nana Patole

More Telugu News