heroine prathyusha death case: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court verdict on heroine prathyusha death case
  • 24 ఏళ్ల తర్వాత ప్రత్యూష మృతి కేసులో తీర్పు
  • నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు
  • సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ప్రముఖ టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేయడంతో జైలు శిక్షను రెండేళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

ఈ కేసులో సుప్రీంకోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. గత ఏడాది నవంబర్‌లో విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత ఈరోజు తీర్పును వెలువరిస్తూ, సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002లో తాను, ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించామని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థరెడ్డి చెబుతున్నారు. తన కూతురు ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డి కారణమని సరోజిని ఆరోపించారు.
heroine prathyusha death case
Actress Prathyusha
Supreme Court
Supreme Court Verdict

More Telugu News