Palash Muchhal: పలాశ్ ముచ్చల్‌పై 'నోరు పారేసుకోవద్దు': స్మృతి మంధాన ఫ్రెండ్‌కు బాంబే హైకోర్టు వార్నింగ్

Palash Muchhal Bombay High Court Warns Smriti Mandhana Friend
  • పలాశ్ ముచ్చల్‌పై పరువు నష్టం వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశం
  • నటుడు విజ్ఞాన్ మానేకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
  • రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగీత దర్శకుడు పలాశ్
  • వాణిజ్య వివాదంలో వ్యక్తిగత ఆరోపణలు సరికావన్న న్యాయస్థానం
  • తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసిన కోర్టు
సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్‌పై పరువు నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానేను బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పలాశ్ లేదా అతడి తల్లిని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర, ధ్రువీకరించని ప్రకటనలు చేయరాదని జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో పలాశ్ ముచ్చల్ వివాహం రద్దు కావడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. స్మృతి స్నేహితుడిగా చెబుతున్న విజ్ఞాన్ మానే.. పలాశ్‌పై ఆర్థిక, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక సినిమా ప్రాజెక్టు కోసం తన వద్ద రూ.40 లక్షలు తీసుకుని పలాశ్ మోసం చేశాడని విజ్ఞాన్ ఆరోపించారు. దీంతోపాటు పెళ్లి రద్దుకు సంబంధించిన వ్యక్తిగత అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.

ఈ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ పలాశ్ ముచ్చల్.. విజ్ఞాన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఇరువర్గాల మధ్య ఉన్నది వాణిజ్యపరమైన వివాదమని, దానికి పెళ్లి రద్దు వంటి వ్యక్తిగత అంశాలను ముడిపెట్టడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. విజ్ఞాన్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది.

తన ఆరోపణలకు ఆధారాలు సమర్పించేందుకు విజ్ఞాన్‌కు రెండు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం, తదుపరి విచారణను మార్చి 11, 2026కు వాయిదా వేసింది.
Palash Muchhal
Smriti Mandhana
Bombay High Court
Vignaan Mane
defamation case
Palash Muchhal controversy
film maker
Indian cricketer
financial dispute
marriage cancellation

More Telugu News