Mohan Babu: కిడ్నాప్ కేసు: మోహన్‌బాబుకు హైకోర్టులో దక్కని ఊరట

Mohan Babu No Relief in High Court Kidnap Case
  • కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు
  • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు మధ్యంతర ఉత్తర్వులు నిరాకరణ
  • మోహన్‌బాబు పాత్రపై ఆధారాలున్నాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • బాధితుడి వాదనలు విన్నాకే నిర్ణయమని స్పష్టం చేసిన న్యాయస్థానం
  • కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్సలర్, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా మోహన్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో తన క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆ సమయంలో ఆయన స్థానికంగా లేరని తెలిపారు. కేవలం వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ కేసు పెట్టారని వాదించారు. అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏపీపీ) సందీప్ ఈ వాదనలను వ్యతిరేకించారు. కిడ్నాప్ వ్యవహారంలో మోహన్‌బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఘటన సమయంలో ప్రధాన నిందితుడైన వర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్, మెసేజ్‌ల ద్వారా సంభాషించారని పేర్కొన్నారు. ఇదే కేసులో A3గా ఉన్న మంచు విష్ణుకు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు ఈ నెల 3న తమపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బాధితుడి వాదనలు కూడా విన్న తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కేసు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.
Mohan Babu
Mohan Babu kidnap case
Manchu Vishnu
Tirupati
Kidnap case
AP High Court
Tiruchanoor Police
Sri Vidyaniketan University
Student leaders
FIR Quash Petition

More Telugu News