Salman Agha: భారత్‌తో మ్యాచ్ మా చేతుల్లో లేదు: పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా

Salman Agha Says India Match Not in Our Hands
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా హై-ప్రొఫైల్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు అనుమతి లభించకపోవడంపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందించాడు. ఈ విషయం తమ నియంత్రణలో లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని, దానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాడు. కొలంబోలో ఐసీసీ నిర్వహించిన కెప్టెన్ల మీడియా సమావేశంలో ఆఘా ఈ వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా, గ్రూప్ దశలోని మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం తమ జట్టు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోందని తెలిపాడు. "గత వరల్డ్ కప్‌లో అమెరికా చేతిలో ఓడిపోయాం, కానీ అది ఇప్పుడు గతం. ఇది కొత్త ప్రపంచకప్, కొత్త జట్టు, కొత్త కలయికతో బరిలోకి దిగుతున్నాం. మా సన్నద్ధతపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం" అని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ప్రపంచకప్‌లో జట్టును నడిపించడం ఇదే తొలిసారి కావడంపై ఆఘా సంతోషం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి, వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే తన లక్ష్యమని వివరించాడు.

గత ఐసీసీ టోర్నీలలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడం అభిమానులను నిరాశపరిచిందని అంగీకరించాడు. "గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి టోర్నీ గెలుస్తామనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం. అభిమానులు మాకు మద్దతుగా నిలవాలి" అని కోరారు. ఇటీవలే ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో సిరీస్ గెలవడం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు.

టోర్నమెంట్‌లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయబోమని, నెదర్లాండ్స్ వంటి జట్లతో కూడా పూర్తి సన్నద్ధతతో ఆడతామని సల్మాన్ అలీ ఆఘా తెలిపాడు. శ్రీలంక తమకు రెండో ఇల్లు లాంటిదని, ఇక్కడి అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. వాతావరణం వంటి తమ నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం లేదని, కేవలం మంచి క్రికెట్ ఆడటంపైనే దృష్టి సారిస్తామని స్పష్టం చేశాడు.
Go Back to Shorts
Salman Agha
Pakistan Cricket
T20 World Cup
India Pakistan Match
ICC Tournament
Cricket World Cup
Pakistan Captain
Cricket
Salman Ali Agha

More Telugu News