Pawan Kalyan: జగన్‌కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. చర్యలు తీసుకుంటే జగన్ అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్య

Pawan Kalyan Jagan Will Vanish if Actions Taken
  • కిరాయి గ్యాంగ్‌లపై చర్యలు తీసుకుంటే జగన్ అడ్రస్ గల్లంతేనన్న పవన్
  • అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ తరహా విధానాలు అమలు చేస్తామని స్పష్టీకరణ
  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
వైసీపీ అధినేత జగన్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మళ్లీ వస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. కిరాయి గ్యాంగ్‌లపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే, అప్పుడు జగన్ ఎక్కడుంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అవసరమైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహా విధానాలు అవలంబించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో రూ.3,050 కోట్ల వ్యయంతో చేపడుతున్న 'అమరజీవి జలధార' ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ జగన్‌పై విమర్శలు గుప్పించారు. "విదేశాల్లో కూర్చుని మాట్లాడేవారిని, ఇక్కడుండి మేమొస్తే అంటూ బెదిరించే వారిని ఏం చేయాలి?" అని పవన్ ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందని, చిన్న వయసులోనే పిల్లల మనసుల్లో కులాల పేరుతో విషబీజాలు నాటడం సమాజాన్ని వెనక్కి నెట్టడమేనని విమర్శించారు. తాను ప్రజల మధ్య ఉండే వ్యక్తినని, ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేయనని అన్నారు.

ఈ కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మక సూచనలను స్వాగతిస్తుందని, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోదని పవన్ కల్యాణ్ తెలిపారు. 'అమరజీవి జలధార' ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని, ఇది ఏ ఒక్క కులానికో, వర్గానికో సంబంధించింది కాదని, ప్రజలందరి ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు.
Pawan Kalyan
Jagan
Amarajeevi Jaladhara
Andhra Pradesh Politics
Yogi Adityanath
Uttar Pradesh
TDP
Janasena
Political Threats
Drinking Water Project

More Telugu News