Pawan Kalyan: పదేళ్లుగా చూస్తున్నాం... అలాంటి వారి ఉచ్చులో పడవద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Warns Against Divisive Forces in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి అశాంతిని కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వీటి పట్ల ప్రజలు, జనసేన, కూటమి శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రెచ్చగొట్టే ప్రకటనలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారి ఉచ్చులో పడకుండా, చట్టపరమైన మార్గాల్లోనే ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టమైన పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చానెళ్ల ముసుగులో కొందరు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇలాంటి కుయుక్తులతో సమాజంలో అభద్రతను సృష్టించే వారి నైజాన్ని గత పదేళ్లుగా చూస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే కుట్రదారుల లక్ష్యం నెరవేరుతుందని, కాబట్టి సంయమనం పాటించాలని ఆయన సూచించారు.

ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ చానెల్ లో ఒక వ్యక్తితో ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర భాషలో మాట్లాడించి, దానిని ప్రచారం చేయడం వెనుక ఉన్న దుష్ట ఆలోచనను గ్రహించాలన్నారు. దీనిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి ముందుకెళ్లాలే తప్ప, తొందరపడి ఘర్షణలకు దిగితే సమస్య మరింత జటిలమవుతుందని ఆయన విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని నాయకులు బయటకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలని పార్టీ నాయకులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. విశ్లేషకులు, సోషల్ మీడియా ముసుగులో రెచ్చగొట్టే వారితో పాటు, వారి వెనుక ఉండి వ్యవస్థీకృతంగా కుట్రలు చేసే వారిపై కూడా భారత న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించాలని జనసేన, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. దుష్ప్రచారాలను ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగానే తిప్పికొడదామని పవన్ కల్యాణ్ అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Machilipatnam
Janasena
political conspiracy
social media
communal harmony
Youtubers
TDP
coalition government

More Telugu News