జీఎస్టీ సంస్కరణలు.. దేశానికి అసలైన దీపావళి కానుక: డిప్యూటీ సీఎం పవన్
- పేదలకు అనుకూలమైన, వృద్ధికి దోహదపడే నిర్ణయమన్న జనసేనాని
- సామాన్యులు, రైతులు, మధ్యతరగతికి భారీ ఊరట కల్పిస్తాయన్న పవన్
- విద్య, బీమా రంగాలపై జీఎస్టీ పూర్తి రద్దును స్వాగతించిన డిప్యూటీ సీఎం
- బీజేపీ నేతలు పురందేశ్వరి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం
పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు రైతులకు, ఆరోగ్య రంగానికి గణనీయమైన ఉపశమనం కల్పించడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నట్లు పవన్ తెలిపారు. జీవితాలకు భరోసా ఇచ్చే విద్య, బీమా రంగాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం ద్వారా ఎన్నో కుటుంబాల కష్టాలు తీరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణలు తీసుకొచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, జీఎస్టీ కౌన్సిల్కు పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సైతం జీఎస్టీ సంస్కరణలను ప్రశంసించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకే 'నెక్స్ట్-జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు' వచ్చాయని ఆమె గుర్తుచేశారు. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా ఈ సంస్కరణలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పన్ను తగ్గింపులు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, వ్యాపారాలు, రైతులతో పాటు సామాన్యులకు ఉపశమనం కలిగిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రజలకు నిజమైన దీపావళి కానుక ఇచ్చారని బండి సంజయ్ అన్నారు.