Srinivas: ప్యాంట్ జేబులో పేలిన్ సెల్ ఫోన్... యువకుడికి గాయాలు

Srinivas Cell Phone Explodes in Pocket Injuring Youth
షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అతను నడుచుకుంటూ వెళ్తుండగా ప్యాంటు జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి.

రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రోజూలాగే తన స్మార్ట్‌ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకుని పనికి వెళుతుండగా, ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. క్షణాల్లోనే దాని నుంచి మంటలు వ్యాపించి బట్టలకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ ఫోన్‌ను జేబులోంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతని తొడకు మంటలు తగిలి చర్మం కాలిపోయింది.

స్థానికులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తొడపై చర్మం కాలిపోయిందని, శ్రీనివాస్ వెంటనే స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. కాస్త ఆలస్యమైతే గాయం కండరాల వరకు వెళ్లి ఉండేదని వారు వివరించారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మే నెలలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బీటెక్ విద్యార్థి జేబులో ఫోన్ పేలి తీవ్రంగా గాయపడగా, ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ యువకుడి ఐఫోన్ పేలింది. ఫోన్‌ను అతిగా ఛార్జింగ్ చేయడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి కారణాల వల్లే పేలుళ్లు సంభవిస్తాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే వాడకం ఆపి, చల్లని ప్రదేశంలో ఉంచాలని వారు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Srinivas
Smartphone blast
Phone explosion
Attapur
Rajendranagar
Mobile phone safety
Phone battery
Rangareddy district
Tech news
Mobile explosion

More Telugu News