Dil Raju: గేమ్ ఛేంజర్ సినిమా దెబ్బకు మా జీవితాలు అయిపోయాయి అనుకున్నాం.. నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు

Game Changer Movie Failure Producer Shirish Emotional Comments
షార్ట్స్‌లో చూడండి
ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్‌గా నిలవగా, దీని తాలూకు పరిణామాలపై నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా వల్ల తాము ఎదుర్కొన్న ఆర్థిక, మానసిక ఒత్తిడి గురించి ఆయన తొలిసారిగా పంచుకున్నారు.

జీవితాలు అయిపోయాయనుకున్నాం
ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ సినిమా వ్యాపారంలో ఉండే నష్టభయం గురించి వివరించారు. ‘‘సినిమా వ్యాపారం ఎంత రిస్క్‌తో కూడుకున్నదో అందరికీ తెలుసు. ఉదాహరణకు మా ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలనే తీసుకోండి. ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో మా జీవితాలు ఇక అయిపోయాయని అనుకున్నాం. కానీ అదే సమయంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాకు ఆశ కల్పించింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మా బతుకులు మారిపోయాయి. ఆ సినిమా లేకపోతే మా పరిస్థితి ఏంటో ఊహించుకోండి’’ అని శిరీష్ వివరించారు.

హీరో.. దర్శకుడు పట్టించుకోలేదు
‘గేమ్ ఛేంజర్’ నష్టాల తర్వాత హీరో రామ్ చరణ్ గానీ, దర్శకుడు శంకర్ గానీ తమను కనీసం పలకరించలేదని శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయినప్పుడు హీరో మాకు సాయం చేశారా? దర్శకుడు ఏమైనా అండగా నిలిచారా? కనీసం మర్యాదపూర్వకంగానైనా ‘ఎలా ఉన్నారు?’ అని కూడా ఎవరూ అడగలేదు. అయితే మేం ఎవరినీ నిందించడం లేదు. మేమే ఇష్టపడి సినిమా తీశాం, నష్టాలను మేమే ఎదుర్కొన్నాం. పారితోషికాలు వెనక్కి అడిగే స్థాయికి మేం ఇంకా దిగజారలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. రామ్ చరణ్‌తో తమకు సత్సంబంధాలే ఉన్నాయని, ఆయనకు మరో ప్రాజెక్ట్ చెప్పే అవకాశం ఉందని, అయితే దానికి ఒప్పుకోవడం, కాదనడం ఆయన ఇష్టమని తెలిపారు.

చరణ్‌తో మరో సినిమా చేస్తాం: దిల్ రాజు
మరోవైపు, నితిన్ ‘తమ్ముడు’ సినిమా ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంపై స్పందించారు. రామ్ చరణ్‌తో ఒక సూపర్ హిట్ తీయలేకపోయినందుకు తాము బాధపడుతున్నామని, ఆ లోటును భర్తీ చేసేందుకు త్వరలోనే ఆయనతో మరో చిత్రాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు. ‘‘ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’ రూపంలో మాకు ఎదురుదెబ్బ తగిలింది. రామ్ చరణ్‌తో ఒక సూపర్ హిట్ ఇవ్వలేకపోయామనే బాధ ఉంది. ఇప్పుడు ఆయనతో మరో హిట్ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తాను’’ అని దిల్ రాజు పేర్కొన్నారు.

2021లో ప్రారంభమైన ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 186.25 కోట్లు మాత్రమే వసూలు చేసి, ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Go Back to Shorts
Dil Raju
Game Changer movie
Ram Charan
Shankar
Telugu cinema
Tollywood
Movie loss
Sankranthiki Vasthunnam
Kiara Advani
SJ Surya

More Telugu News