చంద్రబాబు, పవన్ మద్దతుతో మోదీ ధీమాగా ఉన్నారు: షర్మిల
- పోలవరం ఎత్తు తగ్గించడంపై ఏపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని షర్మిల విమర్శ
- ఎంపీల్లో ప్రశ్నించే ఒక్క మగాడూ లేరంటూ ఘాటు వ్యాఖ్యలు
- రాహుల్ ప్రధాని అయితేనే విభజన హామీలు నెరవేరుతాయని స్పష్టీకరణ
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించి, ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడే "ఒక్క మగాడు కూడా లేరా?" అంటూ నిలదీశారు. బనకచర్ల స్లూయిస్ విషయంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమ పార్టీ విధానమని, నీటి హక్కుల సాధన కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ భవిష్యత్తుపై మాట్లాడుతూ, "కాంగ్రెస్ ఒక మహాసముద్రం లాంటిది. పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే. ఈ విషయం వైసీపీకి కూడా వర్తిస్తుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇస్తున్న మద్దతుతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో ధీమాగా ఉన్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకపోతే, రాహుల్ గాంధీ ప్రధాని కాకపోతే విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా ఇతర హామీల సాధన కాంగ్రెస్తోనే సాధ్యమని ఆమె పునరుద్ఘాటించారు.