YS Sharmila: చంద్రబాబు, పవన్ మద్దతుతో మోదీ ధీమాగా ఉన్నారు: షర్మిల

YS Sharmila Slams Chandrababu Modi Alliance
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తున్నా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీల్లో ఒక్కరూ కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని ఆమె మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించి, ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడే "ఒక్క మగాడు కూడా లేరా?" అంటూ నిలదీశారు. బనకచర్ల స్లూయిస్ విషయంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమ పార్టీ విధానమని, నీటి హక్కుల సాధన కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ భవిష్యత్తుపై మాట్లాడుతూ, "కాంగ్రెస్ ఒక మహాసముద్రం లాంటిది. పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే. ఈ విషయం వైసీపీకి కూడా వర్తిస్తుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇస్తున్న మద్దతుతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో ధీమాగా ఉన్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకపోతే, రాహుల్ గాంధీ ప్రధాని కాకపోతే విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా ఇతర హామీల సాధన కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆమె పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
YS Sharmila
Andhra Pradesh
APCC
Polavaram Project
Chandrababu Naidu
Narendra Modi
Pawan Kalyan
Congress Party
Special Status

More Telugu News