పుణేలో బ్రిడ్జి కూలి నలుగురి మృతి... మహారాష్ట్ర సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ
- పుణెలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలి ఘోర ప్రమాదం
- ఘటనలో నలుగురు పర్యాటకులు మృతి, పలువురు గల్లంతు
- సురక్షితంగా 39 మందిని కాపాడిన సహాయక బృందాలు
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
- వంతెనల నాణ్యతపై తనిఖీలకు సీఎం ఆదేశం
- భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద సమయంలో వంతెనపై అధిక సంఖ్యలో పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. వంతెన శిథిలావస్థకు చేరడం, సామర్థ్యానికి మించి జనం ఉండటమే ప్రమాదానికి కారణమని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. ఇదే ప్రాంతంలో రూ.8 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని నదీ వంతెనల నిర్మాణ నాణ్యతపై తనిఖీలు (స్ట్రక్చరల్ ఆడిట్) నిర్వహించాలని మరో ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యల గురించి సీఎం ఫడ్నవీస్ను అడిగి తెలుసుకున్నారు.