Colonel Sofia Khureshi: మీది ఏ రకం క్షమాపణ?... కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్య ప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం

Supreme Court Anger Over Madhya Pradesh Ministers Remarks on Colonel Sofia Khureshi
షార్ట్స్‌లో చూడండి
సైనిక అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన చెప్పిన క్షమాపణ ఏమాత్రం సరిపోదని, "ఈ వ్యాఖ్యలు దేశానికే తలవంపులు తెచ్చేలా ఉన్నాయని" అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సోమవారం నాడు ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మంత్రి విజయ్ షా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "మంత్రిగారి వ్యాఖ్యలతో యావత్ దేశం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది" అని కోర్టు వ్యాఖ్యానించింది. నిజాయతీగా క్షమాపణ చెప్పడం ద్వారా లేదా సరైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం ద్వారా తన తప్పును సరిదిద్దుకోవాలని మంత్రికి సూచించింది. ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు చేసే ముందు సున్నితత్వాన్ని పాటించాలని హితవు పలికింది.

తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా, మంత్రి క్షమాపణ చెప్పారా అని ధర్మాసనం ప్రశ్నించగా, ఆయన తరఫు న్యాయవాది ఇప్పటికే క్షమాపణ చెప్పారని తెలిపారు. అయితే, ఆ క్షమాపణలోని నిజాయతీని, ఉద్దేశాన్ని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, "ఈ విషయం చాలా సున్నితమైనది... మీరెలాంటి క్షమాపణ చెప్పారో మేం చూడాలనుకుంటున్నాం... క్షమాపణ అనే పదానికి ఓ అర్థం ఉంది... కొన్నిసార్లు పరిణామాల నుంచి తప్పించుకోవడానికి... కొన్నిసార్లు మొసలి కన్నీరు కార్చడానికి చెబుతారు... మీది ఏ రకం?" అని వ్యాఖ్యానించారు.

ఈ కేసులో మంత్రి విజయ్ షా అరెస్టుపై స్టే విధిస్తూనే, ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి వీల్లేదని ధర్మాసనం హెచ్చరించింది. "ఆయన తన చర్యలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీన్ని రాజకీయం చేయడానికి మేం అనుమతించం" అని జస్టిస్ కాంత్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

మంగళవారంలోగా సిట్‌ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ దర్యాప్తు బృందంలో రాష్ట్రం బయటి నుంచి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉండాలని, వారిలో కనీసం ఒకరు మహిళా అధికారి అయి ఉండాలని స్పష్టం చేసింది. మే 28వ తేదీ నాటికి సిట్ తన దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. "మనది చట్టబద్ధ పాలన అనుసరించే దేశం, ఇది అత్యున్నత స్థాయిలో ఉన్నవారి నుంచి అట్టడుగున ఉన్నవారి వరకు అందరికీ ఒకేలా వర్తిస్తుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జరగబోయే సిట్ దర్యాప్తు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఒక 'అగ్నిపరీక్ష' వంటిదని, ఈ కేసును తాము నిశితంగా పర్యవేక్షిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
Go Back to Shorts
Colonel Sofia Khureshi
Vijay Shah
Madhya Pradesh Minister
Supreme Court
Inappropriate Remarks
SIT Investigation
India
Arrest
Apology
Military Officer

More Telugu News