Omar Abdullah: పాకిస్థాన్ సైన్యం కాల్పులు... తీవ్రంగా మండిపడిన ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah Condemns Pakistan Army Firing
షార్ట్స్‌లో చూడండి
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ రేంజర్లు భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడాన్ని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో పది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గత నెలలో పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత భూభాగంలోని పౌర నివాసాలపై కాల్పులు జరిపారని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, "పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ స్పందించిన తీరు చాలా స్పష్టంగా ఉంది. పాకిస్థాన్‌లోని పౌరులను కాకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం. కానీ, పాకిస్థాన్ మాత్రం దీనికి భిన్నంగా, అన్యాయంగా జమ్ముకశ్మీర్‌లోని మన పౌరులపై కాల్పులు జరిపి 10 మందిని పొట్టన పెట్టుకుంది" అని విమర్శించారు.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు అబ్దుల్లా తెలిపారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, పాకిస్థాన్ చర్యలను దీటుగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పౌరుల భద్రతకు, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
Go Back to Shorts
Omar Abdullah
Pakistan Army Firing
Jammu and Kashmir
Line of Control
Cross Border Firing
India-Pakistan Conflict
Terrorism
Civilian Casualties
Operation Sindhu
Pakistani Rangers

More Telugu News