డోర్లు లాక్ అయినా వందే భారత్ రైలు ఎక్కొచ్చు.. కానీ ఇలా చేయాలి!
- వందే భారత్ డోర్లు మూసుకుపోయినా గార్డు కోచ్ ద్వారా ఎక్కే అవకాశం
- స్టేషన్ మిస్సయితే వెంటనే టీటీఈని సంప్రదించాలి, చైన్ లాగకూడదు
- చివరి నిమిషంలో కాకుండా ముందుగానే స్టేషన్కు రావాలని సూచన
- భద్రత, సమయపాలన కోసమే ఆటోమేటిక్ డోర్ల వ్యవస్థ అని రైల్వే శాఖ వెల్లడి
రైల్వే శాఖ సూచనల ప్రకారం, ఒకవేళ ప్రయాణికులు ప్లాట్ఫారమ్కు చేరుకునేసరికి తమ కోచ్ డోర్లు మూసుకుపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు రైలు వెనుక భాగంలో ఉండే గార్డు కోచ్ ద్వారా ఎక్కి, ఆ తర్వాత తమ సీట్ల వద్దకు నడుచుకుంటూ వెళ్లవచ్చు. అయితే, ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రయాణికులు వీలైనంత ముందుగా స్టేషన్కు చేరుకోవడం ఉత్తమమని అధికారులు గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.
అలాగే, రైలులో ప్రయాణిస్తూ తాము దిగాల్సిన స్టేషన్లో దిగలేకపోయినట్లయితే, ఆందోళనతో డోర్లను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించడం లేదా ఎమర్జెన్సీ చైన్ లాగడం వంటివి చేయరాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప చైన్ లాగితే జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. బదులుగా, వెంటనే టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)ని సంప్రదించాలని లేదా డోర్ల వద్ద ఉండే ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించింది. టీటీఈ తదుపరి స్టేషన్లో దిగేందుకు ఏర్పాట్లు చేస్తారని, అవసరమైతే నిర్దేశిత రుసుము, జరిమానా వసూలు చేయవచ్చని వివరించింది.
మెట్రో రైళ్ల మాదిరిగా ప్రయాణ అలవాట్లను అలవర్చుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులను కోరింది. స్టేషన్ రాకముందే లగేజీతో సిద్ధంగా ఉండటం, త్వరగా ఎక్కడం, దిగడం వంటివి చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆధునిక రైల్వే వ్యవస్థలో భద్రత, సమయపాలన కోసమే ఈ ఆటోమేటిక్ డోర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.