అన్నదాతలపై చంద్రబాబు పగ పెంచుకున్నారు: కాకాణి

Kakani fires on Chandrababu
  • కూటమి పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న కాకాణి
  • రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని మండిపాటు
  • మిర్చి రైతులు రూ. 6 వేల కోట్ల మేర నష్టపోతున్నారని ఆవేదన
కూటమి పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులను దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందా? అని ప్రశ్నించారు. అన్నదాతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పగ పెంచుకున్నారని అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని దుయ్యబట్టారు.

జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్ కు పేరు వస్తుందనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప చేతల్లో లేదని అన్నారు. 

మిర్చికి ధరలు లేక రైతులు నష్టపోతున్నారని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 6 వేల కోట్ల మేర మిర్చి రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని... రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చెయ్యకపోవడం వల్ల... రైతులు అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. రాబడి తగ్గడంతో రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Kakani Govardhan Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News