కేసు విచారణ కారణంగా శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా: అల్లు అర్జున్

Allu Arjun tweets about injured boy Sritej
  • సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన
  • రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు
  • బాలుడ్ని అల్లు అర్జున్ పరామర్శించలేదంటూ విమర్శలు!
  • స్పందించిన అల్లు అర్జున్
డిసెంబరు 4వ తేదీ రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

కాగా, అల్లు అర్జున్ ఇంతవరకు ఆ బాలుడ్ని పరామర్శించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసు విచారణ జరుగుతున్నందున తాను శ్రీతేజ్ ను కలవలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. బాలుడు శ్రీతేజ్ పరిస్థితి పట్ల తాను ఎంతో బాధపడుతున్నానని, దురదృష్టకర ఘటనలో గాయపడిన ఆ చిన్నారి ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉండడం తనను వేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. 

కేసు విచారణలో ఉన్నందున ఆ బాలుడ్ని, బాధిత కుటుంబాన్ని కలవకూడదన్న సలహా మేరకు తాను పరామర్శకు రాలేకపోతున్నానని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. బాధిత కుటుంబం క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. బాలుడు శ్రీతేజ్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, వీలైనంత త్వరలోనే బాలుడి కుటుంబాన్ని కలవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
Go Back to Shorts
Allu Arjun
Sritej
Revathi
Sandhya Theater Incident

More Telugu News