మహారాష్ట్ర ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన 'కేకే సర్వే'!

Once Again KK Survey Sensation
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేకే సర్వే వెల్లడించిన అంచనాలు నిజమయ్యాయి. ఎన్డీయే కూటమి 225 స్థానాల్లో గెలుస్తుందంటూ కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ వెలువరించింది. శనివారం వెలువడుతున్న ఫలితాలు ఈ సర్వే అంచనాలకు అనుగుణంగానే ఉండడం విశేషం. ఈ సర్వే చేసిన వ్యక్తి మన తెలుగు వాడే కావడం గర్వకారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీయే అభ్యర్థులు 222 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కేకే పేరు మార్మోగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పడంతో పాటు జనసేన మొత్తం 21 చోట్ల గెలుస్తుందని కేకే సర్వే పేర్కొంది. ఫలితాలను దాదాపు వందకు వంద శాతం ముందే అంచనా వేయడంతో కేకే సర్వేపై విశ్వసనీయత పెరిగింది. అయితే, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేకే సర్వే అంచనాలు తారుమారయ్యాయి.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేకే సర్వే అంచనాలపై కాస్త అపనమ్మకం ఏర్పడింది. జాతీయ స్థాయిలో సర్వేలన్నీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని చెప్పాయి. అయితే, ఏ సర్వే కూడా ఎన్డీయేకు 225 సీట్లు వస్తాయని చెప్పలేదు. కేవలం కేకే సర్వే మాత్రమే ఈ నెంబర్ పేర్కొంది. దీంతో సర్వేపై రాజకీయ వర్గాల్లో సందిగ్ధం వ్యక్తం కాగా.. కేకే స్పందిస్తూ మహారాష్ట్ర ఫలితాలు కచ్చితంగా తమ సర్వే అంచనాలకు అనుగుణంగానే వస్తాయని, కావాలంటే రాసిపెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
KK Survey
Maharashtra Results
Exit Polls
225 seats
NDA

More Telugu News