Arvind Kejriwal: కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంపై ఆప్ కీలక ప్రకటన

Arvind Kejriwal to move out from official residence
  • నిన్న రాజీనామా లేఖను సమర్పించిన కేజ్రీవాల్
  • సీఎం అధికారిక నివాసాన్ని, సెక్యూరిటీని వదులుకోనున్న కేజ్రీ
  • ఆతిశీ సీఎంగా ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. కేజ్రీవాల్ వారం రోజుల్లో అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్నట్టు ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు. 

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు నిన్న రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా తనకు లభిస్తున్న అన్ని సదుపాయాలను తాను వదులుకుంటున్నానని చెప్పారని ఆయన వెల్లడించారు. సీఎం హోదాలో తనకున్న సెక్యూరిటీని కూడా వదులుకుంటానని, ఒక సాధారణ పౌరుల్లో ఒకరిగా జీవిస్తానని చెప్పారని అన్నారు. 

ఆయనపై ఇప్పటికే భౌతికదాడులు జరిగాయని... తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కేజ్రీవాల్ ను తాము కోరామని... అయితే తమ విన్నపాన్ని ఆయన అంగీకరించలేదని సంజయ్ సింగ్ తెలిపారు. "ఆరు నెలలు జైల్లో ఉన్నా. జైల్లో ఉన్నప్పుడు నన్ను దేవుడు కాపాడాడు. ఇప్పుడు కూడా దేవుడే కాపాడతాడు" అని తమతో కేజ్రీవాల్ చెప్పారని అన్నారు. 

అయితే, కేజ్రీవాల్ ఎక్కడుంటారనేది ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పారు. మరోవైపు ఆతిశీ నేతృత్వంలో ఆప్ కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
Arvind Kejriwal
AAP

More Telugu News