వైసీపీలో యాంకర్ శ్యామలకు కీలక పదవి

YSRCP appoints Official Spokespersons including Roja and Anchor Syamala
  • వైసీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా యాంక‌ర్ శ్యామ‌ల‌
  • శ్యామ‌ల‌తో పాటు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, జూపూడి ప్ర‌భాక‌ర్‌, ఆర్‌కే రోజాల‌కు ఇదే హోదా
  • మొన్న‌టి ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్యామ‌ల‌ ప్రచారం
  • ఇప్పుడు అధికార ప్రతినిధి హోదాతో ప్రత్య‌క్ష రాజ‌కీయాల్లోకి శ్యామ‌ల‌
ఇటీవ‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి, ఆ త‌ర్వాత కీల‌క నేత‌లు పార్టీని వీడుతుండ‌డంతో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ పార్టీని బలోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించ‌డం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకూ స్థానచలనం కల్పించారు. 

తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావుల‌ను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేశారు. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

కాగా, మొన్న‌టి ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్యామ‌ల‌ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం వేదిక‌గా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించిన శ్యామ‌ల‌పై జ‌న‌సేన‌, టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేశారు. అప్పటికే ఆమె పార్టీ కార్య‌క్ర‌మాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నప్పటికీ.. పార్టీపరంగా ఎలాంటి హోదా కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఆమెకు పార్టీ అధికార ప్రతినిధిగా హోదా లభించింది. దాంతో యాంక‌ర్ శ్యామ‌ల ప్రత్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు.
Advertisement
Anchor Syamala
YSRCP
Official Spokesperson

More Telugu News