విడాకులకు దరఖాస్తు చేసుకుందని.. కుమార్తె కాళ్లు నరికేసిన తండ్రి
- పాకిస్థాన్లోని కరాచీలో దారుణం
- బాధ్యతలు మరిచి హింసిస్తున్న భర్త నుంచి విడాకుల కోసం భార్య దరఖాస్తు
- పరువు తీస్తోందని కుమార్తెపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
- గొడ్డలితో కాళ్లు నరికి పరారీ
కరాచీకి చెందిన బాధిత మహిళ తండ్రి సయ్యద్ ముస్తఫా షా, మామలు సయ్యద్ ఖుర్బాన్ షా, ఎహసాన్ షా, షా నవాజ్, ముస్తాక్ షా కలిసి గొడ్డలితో దాడిచేసి పరారైనట్టు సోబియా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె అరుపులు విని వచ్చిన ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో ఉన్న సోబియాను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
భర్త తనను నిత్యం వేధించేవాడని, ఇద్దరు పిల్లలను ఏనాడూ పట్టించుకోలేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోలేదని సోబియా వాపోయింది. దీంతో అతడి నుంచి విడిపోవాలనుకున్న ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది ఆమె తండ్రికి, మామలకు కోపాన్ని తెప్పించింది. భర్తపై కోర్టుకెక్కడం ద్వారా కుటుంబానికి చెడ్డపేరు తెస్తోందని భావించిన సోబియా కుటుంబం ఈ దారుణానికి పాల్పడింది.