ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
- వైసీపీ బాధితురాలు ఆరుద్రకు రూ.5 లక్షల సాయం
- వైద్య చికిత్స కోసం చెక్ అందజేసిన అధికారులు
- చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లకు ఆరుద్ర కృతజ్ఞతలు
తొలిసారిగా ప్రభుత్వ సాయం..
అనారోగ్యంతో వీల్ చెయిర్ కే పరిమితమైన తన కూతురు దుస్థితి చూసి అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 14న సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని బాధితురాలు ఆరుద్ర చెప్పారు. సీఎం ఆదేశాలతో పది రోజుల్లో సెక్రటేరియట్ కు పిలిపించి చెక్ చేతిలో పెట్టారని వివరించారు. ‘నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది’ అని అన్నారు.
వేధించిన వాళ్లపై కేసులు పెట్టండి..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేస్తాం, చూస్తాం అనడమే తప్ప ప్రభుత్వం తరఫున తనకు ఒక్క రూపాయి సాయం చేయలేదని విమర్శించారు. సాయం చేయకపోగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని, కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అరాచకాలు తట్టుకోలేక ఇల్లూ, వాకిలీ వదిలిపెట్టి వెళ్లి కాశీలో తలదాచుకున్నామని ఆరుద్ర కన్నీటిపర్యంతమయ్యారు. తమను ఇబ్బంది పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని, కోర్టు కేసులు క్లియర్ చేసి తమ ఆస్తి తమకు ఇప్పించాలని ఆరుద్ర విజ్ఞప్తి చేశారు.