'రెండు సందర్భాల్లో నా హృదయం బద్దలైంది.. కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది': కోహ్లీ
- 2016లో జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఓటమి తర్వాత తన హృదయం పగిలిందన్న విరాట్
- జియో సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపిన రన్ మెషీన్
- టీమిండియాకు ప్రపంచకప్ అందించాలనుకున్నా అది నెరవేరలేదంటూ ఆవేదన
ఈ ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడుతూ.. "నా జీవితంలో 2016లో రెండుసార్లు హృదయం బద్దలైంది. ఒకటి టీ20 వరల్డ్ కప్ కాగా, మరొకటి అదే ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్. ఈ రెండింట్లో పరాజయం పాలుకావడం నన్ను ఎంతో కుంగదీశాయి. టీమిండియాకు ప్రపంచకప్ అందించగలను అని అనుకున్నా అది నెరవేరలేదు. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది" అని కోహ్లీ తెలిపాడు.
కాగా, 2016 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు సెమీ ఫైనల్స్ వరకు వెళ్లింది. సెమీస్ లో కరేబియన్ జట్టుతో తలపడిన భారత్ ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయినా విండీస్ ఈ భారీ టార్గెట్ను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ అజేయంగా 89 రన్స్ కొట్టాడు. ఓవరాల్ గా ఈ టోర్నీలో రన్ మెషీన్ బ్యాట్ నుంచి 273 పరుగులు వచ్చాయి.
ఇక అదే ఏడాది రెండు నెలల తర్వాత ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) ఫైనల్ కు చేరింది. ఫైనల్లో సన్రైజర్స్ చేతిలో ఓడింది. హైదరాబాద్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 10.2 ఓవర్లకు 114-0తో పటిష్ఠ స్థితిలో ఉంది. కానీ, తర్వాత వెంటవెంటనే వికెట్లు పారేసుకుని ఐపీఎల్ టైటిల్ చేజార్చుకుంది. ఈ సీజన్లో విరాట్ ఏకంగా 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఇందులో ఏకంగా నాలుగు శతకాలు బాదాడు. ఇన్ని పరుగులు చేసినా ఆర్సీబీ టైటిల్ గెలవకపోవడం విరాట్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లోనూ విరాట్ టాప్ స్కోరర్ (661 పరుగులు) గా ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో సీఎస్కేతో ఆర్సీబీ కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ జట్టుకు ప్లేఆఫ్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఓడితే బెంగళూరు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.