Bhopal: ఓటర్లకు బంపరాఫర్.. ఓటేస్తే లక్కీడ్రాలో వజ్రపుటుంగరం గెలుచుకునే అవకాశం!

Diamond Ring For Vote Madhya Pradesh Election Commission Announced
  • పోలింగ్ శాతం పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారుల వినూత్న ప్రయోగం
  • మే 7న మూడో దశ పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్‌లో మూడుసార్లు లక్కీ డ్రా
  • విజేతకు అక్కడే బహుమతి ప్రదానం
  • రెండుమూడ్రోజుల తర్వాత మెగా డ్రా
  • ప్రకటించిన ఎన్నికల అధికారి

దేశంలో విడతల వారీగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు ఎండదెబ్బ బాగానే తగులుతోంది. నిప్పులు చెరుగుతున్న సూర్యుడి దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఉదయం పది తర్వాతి నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లు బోసిపోతున్నాయి. దీంతో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ శాతమే ఈ విషయం చెబుతోంది.

ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఈ నెల 7న మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఓటింగ్‌లో పాల్గొన్న వారికి కూపన్ ఇస్తారు. ఆ తర్వాత లక్కీ డ్రా నిర్వహిస్తారు.

అందులో గెలుపొందిన వారికి డైమండ్ ఉంగరాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతరవస్తువులు అందిస్తామని అధికారులు ప్రకటించారు. పోలింగ్ రోజు ఉదయం ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా నిర్వహిస్తారు. విజేతకు అక్కడే బహుమతిని అందిస్తారు. ఆ తర్వాత రెండుమూడు రోజులకు మెగా డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News