ఏపీ డీఎస్సీ షెడ్యూల్ మార్చిన ప్రభుత్వం

AP DSC new schedule
  • హైకోర్టు ఆదేశాలతో టెట్, డీఎస్సీ మధ్య గడువు పెంపు
  • ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య నిర్వహణ
  • పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీ మధ్య గడువు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీఆర్టీ, డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్ కుమార్‌ మీడియాకు వెల్లడించారు. టెట్, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే నిర్వహించడం వల్ల ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం ఉండడంలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రెండు పరీక్షల మధ్య తగిన గడువు ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తాజాగా టెట్, డీఎస్సీ షెడ్యూల్ మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 7న ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ప్రిన్సిపల్‌ పోస్టులకు ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు.
Advertisement
AP DSC
schedule
TET
DSC
TRT
PGT
SGT
Teacher Jobs
Job Notifications

More Telugu News