EPFO: పేటీఎంకు మరో షాక్.. కీలక ప్రకటన చేసిన ఈపీఎఫ్‌వో

EPFO blocks Paytm Payments Bank from February 23
షార్ట్స్‌లో చూడండి
ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీ పేటీఎంకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం, దాని అనుబంధ సంస్థలతో ముడిపడిన క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కీలక ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌, దాని అనుబంధ విభాగాలతో అనుసంధానించిన ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించవద్దని ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించింది. ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌లను ఫిబ్రవరి 23 నుంచి నిలిపివేయాలని స్పష్టం చేసింది. దీనిపై అవగాహన పెంచేందుకు వీడియోను రూపొందించి ప్రచారం చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ పరిణామంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విశ్వాసం మరింత సన్నగిల్లనుంది. ఈపీఎఫ్‌వో చర్యతో బ్యాంకు విశ్వసనీయత, ప్రమాణాలపై ఆందోళనలను స్పష్టం చేస్తోంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొత్తగా డిపాజిట్లు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ మంజు అగర్వాల్ బ్యాంక్ కంపెనీ బోర్డుకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయన రాజీనామా చేసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కఠిన ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కంపెనీ బోర్డు నుంచి వైదొలగినట్టు జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Go Back to Shorts
EPFO
Paytm Payments Bank
RBI

More Telugu News