Telugudesam: చంద్రబాబు రాకతో దద్దరిల్లిన బెజవాడ.. బెంజిసర్కిల్‌లో అపూర్వ స్వాగతం

Unprecedented welcome for chandrababu in vijayawada and inBenz in Circle
షార్ట్స్‌లో చూడండి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాత్రి 3.30 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది.

అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో మారుమోగించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లాయి. కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు.

బెంజిసర్కిల్ వద్ద అపూర్వస్వాగతం

తెల్లవారుజామున 4.45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్‌కి అపూర్వస్వాగతం లభించింది. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. కాగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుండి చంద్రబాబు బయలుదేరారు. అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుదీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. 

మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు. 


Go Back to Shorts
Telugudesam
Chandrababu
Andhra Pradesh

More Telugu News