Chandrababu: చంద్రబాబు అరెస్టుపై నేడు కూడా హోరెత్తిన టీడీపీ నిరసనలు

Protests continues in state condemns Chandrababu arrest
షార్ట్స్‌లో చూడండి
అక్రమ కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేశామని జగన్ రెడ్డి చంకలు గుద్దుకోవడం తప్ప సాధించేది ఏమీ లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు మచ్చలేని చంద్రుడిలా బతికారని, నాలుగేళ్ల పాలనంతా అవినీతిమయమైన జగన్ రెడ్డి... చంద్రబాబుపై అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబుకు రూపాయి కూడా అవినీతిని ఆపాదించలేరని టీడీపీ నేతలు పేర్కొన్నారు. 

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 9వ రోజు ‘‘బాబుతో నేను’’ దీక్షల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. చంద్రబాబును అరెస్టు చేస్తే జగన్ రెడ్డికి జ్వరం పట్టుకుందని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. 

రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరులో తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే దీక్షల్లో మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు.మహిళలతో కలిసి పేరూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని, సుధారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు తొండవాడ నుండి చంద్రగిరి బైపాస్ వరకు వేలాది మందితో ర్యాలీ చేపట్టారు. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో(బంజార/సుగాలి) రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 

కెనడాలోని సెంట్రల్ టొరంటో నగరంలో 500 మంది యువకులు నిరసన తెలిపారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఉరితాళ్లకు వేలాడుతూ నిరసన తెలిపారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో పీలా గోవింద సత్యన్నారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా అంబేద్కర్ విగ్రహం ముందు జాతీయ జెండాతో మాజీ సైనికులు నిరసన తెలిపారు. బాబుతోనే మేము అంటూ సంఘీభావం తెలిపారు. 

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ  తెలుగు యువత నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొస్సిపూడి సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తొస్సిపూడి, మరియు పందలపాక తెలుగుదేశం పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆలూరు నియోజకవర్గం సిరుగుప్ప పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

మాడుగుల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్ రాజు ఆధ్వర్యంలో ‘‘బాబుతో నేను’’ కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు పాల్గొన్నారు. ఒంటి కాలుపై నిలబడి సూర్య నమస్కారం చేస్తూ నిరసన తెలిపారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాలు వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 

బాపట్ల నియోజకవర్గం పాండురంగాపురం సముద్రతీరంలో బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి చింతకాయల విజయ్ అధ్వరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి సంఘీభావం తెలిపారు. 

నిరసన కార్యక్రమాలలో పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామహేశ్వరరావు, ఎన్.ఎండీ ఫరూక్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, కూన రవి కుమార్. కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, బి. నాగ జగదీశ్వరరావు, జ్యోతుల నవీన్, గన్ని వీరాంజనేయులు, కొనకళ్ల నారాయణరావు, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జి.వి.ఆంజనేయులు, నూకసాని బాలాజీ, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Arrest
TDP
Protests
Andhra Pradesh

More Telugu News