Pawan Kalyan: నాకు క్రిమినల్స్ అంటే చిరాకు... ఈ దరిద్రులా మనల్ని పాలించేది?: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on YCP leaders
షార్ట్స్‌లో చూడండి
జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో వారాహి విజయ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ వాడీవేడిగా ప్రసంగించారు. 

తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అని స్పష్టం చేశారు. "నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వీళ్లా మనలను పాలించేది.. ఈ దరిద్రులా మనల్ని పాలించేది... ఈ  సన్నాసులా మనల్ని పాలించేది... గూండా గాళ్లు, రౌడీలు, హంతకులు... సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లతో పాలింపబడడానికి" అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తానేమీ సినిమా మాటలు మాట్లాడడంలేదని, సినిమాల కంటే రియల్ లైఫ్ లోనే ఎక్కువ చేస్తానని, గొడవలు అంటే తనకేమీ భయం లేదని స్పష్టం చేశారు. తాను తెగించి పోరాడతానని అన్నారు. 

అంతకుముందు, ఆయన మాట్లాడుతూ, శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురం గడ్డకు రావడాన్ని అదృష్టంగా భావిస్తానని తెలిపారు. ఒక దశాబ్ద కాల ప్రయాణంలో తాను ఎందుకు గట్టిగా నిలబడ్డాను అంటే అది ప్రజల భవిష్యత్ కోసమేనని, పుట్టబోయే ప్రతి బిడ్డ భవిష్యత్ కోసమేనని వెల్లడించారు. గోదావరి తల్లి ఈ నేలను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, నేను కూడా నేలను అంటిపెట్టుకుని ఉంటాను అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

ఒక వయసు వచ్చాక ప్రజలకు కావాల్సింది ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అని పేర్కొన్నారు. అయితే, తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ లా ఏదో చేసేస్తానని చెప్పబోనని, కానీ ఒళ్లు వంచి మీ భవిష్యత్ కోసం పనిచేస్తా అని హామీ ఇచ్చారు. పిఠాపురం వస్తే తనకు దేవతా విగ్రహాల విధ్వంసం గుర్తొస్తుందని అన్నారు. 

"ఇక్కడి దేవతా విగ్రహాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తే పిచ్చోళ్లు చేశారని చెప్పారు. 2019 నుంచి ఇప్పటివరకు అన్ని విగ్రహాలను పిచ్చోళ్లే ధ్వంసం చేశారా? హిందూ వర్గాలకు, ఇతర వర్గాలకు గొడవలు పెట్టించి మళ్లీ ఓట్లు చీల్చి అధికారంలోకి రావాలనే చచ్చు ఆలోచన ఈ ముఖ్యమంత్రిది. 

రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై వైసీపీ కన్ను పడింది. తిరుమలలో శ్రీవారి ట్రస్టు ఉంటుంది. ఇక్కడ 10 వేలు విరాళం ఇస్తే, రూ.300కి బిల్లు ఇస్తారు... మిగతా రూ.9 వేల పైచిలుకు ఎటు వెళతాయో ఎవరికీ తెలియదు. వైసీపీ దోపిడీదారులకు ఒకటే చెబుతున్నా... ఏడుకొండల స్వామితో ఆడుకుంటున్నారు... ఒక్కొక్కడు నామరూపాల్లేకుండా పోతారు. ఆలయాల విధ్వంసం ఘటనల్లో ఈ సీఎం ఒక్కరినైనా పట్టుకున్నారా?" అని ప్రశ్నించారు. 

ఇక, వైసీపీ నేతలతో జరుగుతున్న చెప్పుల యుద్ధంపై పవన్ వ్యంగ్యాస్త్రం విసిరారు. "నా రెండు చెప్పులు ఎవరో కొట్టేశారు. వైసీపీ సర్కారు గుడిలోకి కూడా నా రెండు చెప్పులు పట్టుకుని వెళ్లిపోతోంది. నా చెప్పులు దొంగిలించింది ఎవరో కనిపిస్తే పట్టుకోండి... నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్" అంటూ ఎత్తిపొడిచారు. 

తాను సనాతన హిందువునని, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. కానీ ఈ చచ్చు వైసీపీ ప్రభుత్వం మతాల విద్వేషం రెచ్చగొడుతోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
Go Back to Shorts
Pawan Kalyan
Pithapuram
Varahi Yatra
Janasena
YSRCP

More Telugu News