Chandrababu: ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమందికి నెలకు రూ.1500... టీడీపీ మేనిఫెస్టోతో చంద్రబాబు దూకుడు

  • రాజమండ్రిలో టీడీపీ మహానాడు
  • భారీ బహిరంగ సభ వేదికగా మేనిఫెస్టో విడుదల
  • భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట మేనిఫెస్టో
  • నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి
  • మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Chandrabab unveils TDP Manifesto

రాజమండ్రి మహానాడు బహిరంగ సభ వేదిక పైనుంచి టీడీపీ అధినేత చంద్రబాబు  (ఫేజ్ 1)  ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించారు. యువత, మహిళలు, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించారు. 

పేదల జీవితాల్లో వెలుగులు ఎలా తీసుకురావాలన్న దాని గురించే నిత్యం ఆలోచిస్తుంటామని తెలిపారు. సమర్థులకు, విద్యావంతులకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. వారిది ధన బలం, మనది ప్రజాబలం... రేపటి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని పేర్కొన్నారు. కష్టకాలంలో టీడీపీ ఏంచేస్తుందని రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తున్నారు... ఇప్పుడవన్నీ వివరిస్తాం అని చంద్రబాబు తెలిపారు. 

"నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తా. మంచి ఫలితాలు అందించేలా పరిపాలిస్తా. నా జీవితంలో రాబోయే ఐదేళ్లు మీరు ఊహించని విధంగా పనులు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్లీ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక, కార్యకర్తలు రేపటి నుంచి చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంటింటికీ తిరిగి మేనిఫెస్టోలో వివరాలను ప్రజలకు వివరించండి. దసరా నాటికి పూర్తి మేనిఫెస్టో తీసుకువస్తాం" అని చంద్రబాబు వివరించారు.

టీడీపీ మేనిఫెస్టో వివరాలు...

  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సౌకర్యం.
  • ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం.
  • ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం.
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
  • మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం... ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తాం. 
  • 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుంది
  • ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500.
  • తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు
  • స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తాం.
  • రైతులకు అన్నదాత కార్యక్రమం... రైతులకు ఏటా రూ.20 వేలు 
  • ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్
  • బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం.

More Telugu News