Madhya Pradesh: ‘ది కేరళ స్టోరీ’ ఎఫెక్ట్.. బాయ్‌ఫ్రెండ్‌పై బలవంతపు మతమార్పిడి కేసు పెట్టిన యువతి

  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • కేరళ స్టోరీ చూసొచ్చాక ప్రేమజంట మధ్య వివాదం
  •  యువతిపై చేయిచేసుకున్న బాయ్ ఫ్రెండ్
  • ప్రేమికుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు
  • పెళ్లి పేరిట పన్నిన ప్రేమ వలలో చిక్కుకుపోయానని ఆవేదన
  • ప్రేమికుడిపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు
  • కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్న పోలీసులు
Woman Accuses Boyfriend Of Rape After Fight Over The Kerala Story

‘ది కేరళ స్టోరీ’ చూసొచ్చిన ఓ ప్రేమ జంట మధ్య వివాదం తలెత్తింది. ఆ తరువాత యువతి తన బాయ్‌ఫ్రెండ్‌పై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి ఆరోపణల కింద కేసు పెట్టింది. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇండోర్‌లో ఖజ్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. ఉన్నత చదువులు చదివిన యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుండగా, ఆమె బాయ్‌ఫ్రెండ్ మాత్రం 12వ తరగతి వరకే చదివాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.   

ఇటీవల ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసొచ్చాక వారిద్దరూ సినిమా విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో యువతిపై ఆమె బాయ్‌ఫ్రెండ్ చేయిచేసుకున్నాడు. దీంతో, యువతి మే 19న పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరిట పన్నిన ప్రేమ వలలో తాను చిక్కుకుపోయానని తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి కోసం మతం మారాలంటూ బాయ్‌ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెస్తున్నాడని, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా, అతడిపై అత్యాచార అభియోగం కూడా మోపింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తాజాగా తెలిపారు. మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ (2021) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. యువతి ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ చేపడతామని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మీడియాకు తెలిపారు.

More Telugu News