Pawan Kalyan: చివరకు తనను తాను కూడా వెన్నుపోటు పొడిచేసుకున్నాడు: పవన్‌పై ఆర్జీవీ

  • ట్విట్టర్ వేదికగా జనసేనానీపై ఆర్జీవీ విమర్శలు
  • ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన దాని కంటే దారుణమని వ్యాఖ్య
  • పవన్ ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రగాఢ సానుభూతి అని ట్వీట్
  • ఈ మాత్రం దానికి పార్టీ, పిడికిలి, ఎర్రకండువాలు, చేగువేరాలు... అంటూ ఎద్దేవా 
RGV comments on Pawan Kalyan

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జనసేనాని చివరకు తనను తాను కూడా వెన్నుపోటు పొడుచుకున్నాడని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆర్జీవీ వరుసగా రెండు ట్వీట్లు చేశారు.

ఆ రోజు చంద్రబాబు... ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దాని కంటే దారుణంగా ఈరోజు పవన్ కల్యాణ్ తన జన సైనికులను, తన ఫ్యాన్స్ ను వెన్నుపోటు పొడిచి చంపేశాడని, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తన ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో పవన్ కల్యాణ్ తన సొంత ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా, తన కాపులను, చివరకు తనను తాను కూడా వెన్నుపోటు పొడుచుకున్నాడని పేర్కొన్నారు. మరో ట్వీట్ లో పవన్ కల్యాణ్ వీడియోను పోస్ట్ చేసిన ఆర్జీవీ... ఈ మాత్రం దానికి నీకో పార్టీ, పిడికిలి, ఎర్ర కండువాలు, చేగువేరాలు... అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 

తమకు గత ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చి ఉంటే... ఈసారి ఎన్నికల్లో తాను సీఎం పదవికి రేసులో ఉండేవాడ్నని పవన్ మంగళగిరిలో పేర్కొనడం తెలిసిందే. కానీ తాము ఒక్క స్థానంలోనే గెలవడంతో ఈసారి సీఎం పదవిని డిమాండ్ చేయలేకపోతున్నామని వివరణ ఇచ్చారు.

More Telugu News