Amala Akkineni: ట్రోల్స్ ను పట్టించుకోవద్దని అఖిల్ కు చెప్పాను: అమల

  • ఈ నెల 28న రిలీజైన అఖిల్ ఏజెంట్
  • బాక్సాఫీసు వద్ద నిరాశ!
  • ఏజెంట్ కు మిశ్రమ స్పందన
  • మాట్లాడే ధైర్యం లేనివాళ్లే ట్రోల్ చేస్తారన్న అమల
Amala comes into support for his son Akhil

అఖిల్ అక్కినేని కొత్త చిత్రం ఏజెంట్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా, అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు డినో మోరియా ప్రతినాయక పాత్ర పోషించారు. అయితే, ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తోంది. అత్యధిక శాతం రివ్యూలు ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందన్న అభిప్రాయాలను వెల్లడించాయి. 

ఈ నేపథ్యంలో, అఖిల్ పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై అఖిల్ తల్లి అమల స్పందించారు. ట్రోల్స్ ను పట్టించుకోవద్దని అఖిల్ కు సూచించానని అమల వెల్లడించారు. ఏ విషయం అయినా ధైర్యంగా మాట్లాడలేనివాళ్లే ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుంటారని పేర్కొన్నారు. 

ఏజెంట్ సినిమాను తాను కూడా చూశానని, అందులో అఖిల్ మంచి నటన కనబర్చాడని అమల ప్రశంసించారు. సినిమాలో కొన్ని తప్పులు ఉన్నప్పటికీ, విశాల హృదయంతో చూస్తే అవేవీ కనిపించవని అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు అలా గడిచిపోయిందని తెలిపారు. 

తాను ఏజెంట్ చిత్రం చూసిన థియేటర్ లో అన్ని వయసుల ప్రేక్షకులు ఉన్నారని, తమకు సీన్ నచ్చితే వారు అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అమల వివరించారు. అఖిల్ తర్వాతి సినిమా అందరినీ అలరించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

More Telugu News