Minister Roja: పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే తెలియదు: మంత్రి రోజా

  • ఎప్పుడు ఎవరి జెండా మోయాలో తెలియక ఆ పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్న మంత్రి
  • వడమాలపేటలో చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న రోజా
  • వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ సింగిల్ గానే పోటీ చేస్తారని వెల్లడి
Minister Roja shocking comments on pawan kalyan janasena party

జనసేన పార్టీ పెట్టి తొమ్మిదేళ్లు అవుతోంది.. అయినా పార్టీ ఎందుకు పెట్టాడనే దానిపై పవన్ కల్యాణ్ కు ఇప్పటికీ క్లారిటీ లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కే కాదు, ఆయన అనుచరులకు కూడా ఈ విషయంలో స్పష్టతలేదని మంత్రి చెప్పారు. తన నియోజకవర్గం నగరిలోని వడమాలపేటలో చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ జగన్ పాలనపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ఇలాంటి సంక్షేమ పథకాలేవీ అమలు చేయలేదని ఈ సందర్భంగా మంత్రి రోజా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ సింగిల్‌గానే పోటీ చేస్తారని రోజా తెలిపారు.

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి తొమ్మిదేళ్లయిందని, ఇన్నేళ్లు గడిచినా.. ఎవరి కోసం పార్టీ పెట్టాడు, ఏం చేయడానికి పార్టీ పెట్టాడు అనే విషయంలో ఆయనకు క్లారిటీలేదని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పైన, ఆయన పార్టీపైన ప్రజలకు అస్సలు నమ్మకమేలేదని తెలిపారు. ఎప్పుడు ఎవరి జెండా మోయాలో.. ఎవరిని తిట్టాలో తెలియక జనసేన కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని అన్నారు. చంద్రబాబుతో పాటు ఇలాంటి వాళ్లు ఏకమై సింగిల్ గా వచ్చే సింహం జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని మంత్రి రోజా పేర్కొన్నారు.

More Telugu News