Ganta Srinivasa Rao: ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ రాజధానికి రెఫరెండం అన్న వైవీ సుబ్బారెడ్డి ఎక్కడ?: గంటా శ్రీనివాసరావు

  • ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అన్న వైసీపీ నేతలు ఎక్కడికెళ్లారన్న గంటా
  • వైసీపీ అక్రమాలకు పాల్పడినా ఓడిపోయిందని ఎద్దేవా
  • ఎన్నికలకు ముందే పొత్తులు, సీట్ల పంపకాలు ఉంటాయని వ్యాఖ్య
where is YV Subba Reddy asks Ganta Srinivasa Rao

ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని చెప్పిన వైసీపీ నేతలు ఎక్కడికెళ్లారని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ రాజధానికి రెఫరెండం అని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించకుండా వెళ్లారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడినా వైసీపీ ఓటమిపాలు అయిందని చెప్పారు. వైసీపీ నేతలు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ లొంగకుండా ప్రజలు కచ్చితమైన తీర్పును ఇచ్చారని అన్నారు. టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో గంటా కలిశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గంటా ఈ వ్యాఖ్యలు చేశారు. 


అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని... పొత్తులకు తొందర లేదని గంటా చెప్పారు. ఎన్నికల ముందే పొత్తులు, సీట్ల పంపకాలపై నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కన్నా లక్ష్మీణారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.

More Telugu News