T20 World Cup: మహిళల టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ చేరాలంటే భారత్ చేయాల్సింది ఇదే!

  • ప్రస్తుతం గ్రూప్2లో రెండో స్థానంలో హర్మన్ ప్రీత్ సేన
  • నేడు ఐర్లాండ్‌తో మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీఫైనల్ కు 
  • సా. 6.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
How can  India reach semi finals in Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు విజయాల తర్వాత ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైన భారత్ ఇప్పుడు కీలక సవాల్ కు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే మరో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ రోజు (సోమవారం) సాయంత్రం గ్రూప్‌–2 చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో ప్రస్తుతం గ్రూప్‌1లో భారత మహిళలు నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో నెగ్గిన ఇంగ్లండ్ ఆరు పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్లో అడుగు పెట్టింది. వెస్టిండీస్ నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు విజయాలతో 4 పాయింట్లతో  మూడో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్ ల్లో ఒకే విజయంతో పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఖాతాలో రెండే పాయింట్లున్నా రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉంది. పాక్  మంగళవారం జరిగే చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది. అందులో గెలిచినా నాలుగు పాయింట్లతో నిలుస్తుంది.
 
ఈ నేపథ్యంలో భారత్.. ఐర్లాండ్ పై గెలిస్తే ఆరు పాయింట్లతో ఇతర గణాంకాలతో పని లేకుండా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. ఒకవేళ పాక్ చేతిలో ఇంగ్లండ్ ఓడితే భారత్ కు గ్రూప్ లో అగ్రస్థానం చేరుకునే అవకాశాలూ ఉంటాయి. అది జరగాలంటే ముందుగా ఐర్లాండ్ పై భారీ విజయం సాధించి రన్ రేట్ పెంచుకోవాలి. అందుకు భారత బ్యాటర్లు చెలరేగి ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో ఓడినా భారత్ కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. కానీ, చాలా స్వల్ప తేడాతో ఓడి రన్ రేట్ కాపాడుకోవాలి. అదే సమయంలో  ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడితేనే రన్ రేట్ ఆధారంగా భారత్ ముందుకెళ్తుంది.

More Telugu News